తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైల్వే సేవలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు ప్రాంతాల్లో పట్టాలపైకి వరద నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనేక రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని పాక్షికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు.
కామారెడ్డి–బికనూర్–తలమడ్ల, అకనపేట్–మెదక్ సెక్షన్లలో ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల కరీంనగర్–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–మెదక్, మెదక్–కాచిగూడ, బోధన్–కాచిగూడ, ఆదిలాబాద్–తిరుపతి వంటి రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. గురువారం నడవాల్సిన నిజామాబాద్–కాచిగూడ రైలు కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా మహబూబ్నగర్–కాచిగూడ, షాద్నగర్–కాచిగూడ రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి. వర్షాలు కొనసాగితే మరిన్ని రైళ్లు రద్దు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేశారు. కాచిగూడ (9063318082), నిజామాబాద్ (970329671), కామారెడ్డి (9281035664), సికింద్రాబాద్ (040-27786170) నంబర్లలో సమాచారం పొందవచ్చు.
