సెప్టెంబర్ 14, 15 తేదీలలో తిరుపతిలోని తాజ్ హోటల్లో జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సును ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించనున్నట్టు స్పీకర్ తెలిపారు.
అయన వివరిస్తూ, దేశంలోని 31 అసెంబ్లీలలో మహిళా కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ కమిటీల ద్వారా అనేక సమస్యలు చర్చకు వస్తాయని, స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఒక్కొక్క సమస్యను విడిగా పరిష్కరించలేరని తెలిపారు. అందుకే ఇలాంటి సదస్సులు నిర్వహించి, చర్చించిన విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ నేపథ్యంలో చట్టసభల జాతీయ మహిళా సాధికారిత సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు.
మొదటగా విశాఖపట్నంలో నిర్వహించాలనుకున్నా, పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రాష్ట్రం నుండి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుండి ఆరుగురు చొప్పున 300 మందికి పైగా మహిళా ప్రజాప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని చెప్పారు. రెండు ముఖ్యమైన అంశాలపై చర్చించి, వాటిపై నివేదికను పార్లమెంట్, అసెంబ్లీ ద్వారా ప్రభుత్వాలకు సమర్పిస్తామని పేర్కొన్నారు.
సదస్సు ముగిశాక తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీసిటీ, శ్రీహరికోట, చంద్రగిరి కోట లకు సభ్యులు పర్యటన చేయనున్నారని తెలిపారు. ఈ పర్యటనల్లో ఎలాంటి లోటులు లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో, పదవుల కేటాయింపులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఈ సమీక్షలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.