ఏపీలో “స్త్రీ శక్తి” పథకం అమలుపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీన్ని సమీక్షించి RTC జోన్-1 ఈడీ బ్రహ్మానందరెడ్డి కీలక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడం, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయడం వంటి చర్యలు ఉన్నాయని, పార్వతీపురం మన్యం జిల్లా RTC డిపోను సందర్శించి పరిస్థితులను పరిశీలించారన్నారు.
బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 కొత్త బస్సులు కేటాయించబడనున్నాయని, వీటివల్ల ప్రయాణికుల ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు. “స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం. కొత్త బస్సులు అందుబాటులో ఉంటే మహిళల ఉచిత ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని స్పష్టపరిచారు. 2028 నాటికి రాష్ట్రంలోని అన్ని డిపోలకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంతో పాటు పాత బస్సులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని వివరించారు.
APSRTCలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఉన్నది నిజం అని అంగీకరించిన ఈడీ తాత్కాలిక పరిష్కారంగా “అన్కాల్ డ్రైవర్ల” సేవలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్వతీపురం ప్రాంతానికి అదనపు బస్సులు ఇవ్వమని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు సమస్యలు వినిపించగా, బ్రహ్మానందరెడ్డి అన్ని ప్రతిపాదనలను పరిశీలించి పరిష్కార మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు.