ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అధికారికంగా అమలు చేయడం ప్రారంభించింది. గురువారం అర్ధరాత్రి నుంచి అర్హులైన తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధుల జమ ప్రారంభమైంది. మొత్తం 35,44,459 లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందనుంది. ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో రూ.13,000 తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు. మిగతా రూ.2,000 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలోకి జమ అవుతుంది.
‘తల్లికి వందనం’ పథకం అంటే ఏమిటి?
పేద కుటుంబాల పిల్లలు చదువు మానుకోకుండా కొనసాగించేందుకు ఈ పథకం అమలులోకి తీసుకువచ్చారు. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందుతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికీ ఈ సాయం వర్తిస్తుంది. అందులో రూ.13,000 తల్లి ఖాతాలోకి జమ చేయగా, రూ.2,000 పాఠశాల/కాలేజీ అభివృద్ధికి వినియోగిస్తారు. తల్లి లేనిపక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి ఖాతాలో ఈ మొత్తం జమ చేస్తారు.
‘తల్లికి వందనం’ పథకం అర్హతలు
-
దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి
-
విద్యార్థి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదివి ఉండాలి
-
విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి
-
తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలి
-
కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినదిగా ఉండాలి (పేదరిక రేఖకు దిగువగా)
-
ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజా ప్రతినిధుల పిల్లలు అర్హులు కారరు