ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంకు అపూర్వమైన స్పందన లభిస్తోంది. నాలుగు రోజుల్లోనే 47 లక్షల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి, దాదాపు రూ.19 కోట్ల ప్రయాణ ఖర్చు ఆదా చేసుకున్నారు.
ఒకే రోజు (సోమవారం)లోనే 18 లక్షల మంది మహిళలు పథకాన్ని వినియోగించుకుని, రూ.7 కోట్లకు పైగా ఆదా చేసుకున్నారు.
సచివాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఘాట్ రోడ్ల బస్సుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆమోదం తెలిపారు. అలాగే మహిళలు తమ ఆధార్ కార్డు జిరాక్స్ లేదా మొబైల్లో సాఫ్ట్ కాపీ చూపించినా సరిపోతుందని సూచించారు.
మహిళలకు సులభంగా గుర్తించేందుకు ఉచిత ప్రయాణం వర్తించే బస్సులపై బోర్డులు లేదా స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం వల్ల ప్రతిరోజూ తమకు ఎంత డబ్బు ఆదా అవుతోందో మహిళలు సంతోషంగా చెబుతున్నారని అధికారులు వివరించారు.