ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటిగా రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. వీటిలో ఒకటి వాయుగుండంగా బలపడుతూ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, గురువారం నాటికి ఉత్తర బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా వేగంగా కదులుతూ శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. శనివారం నాటికి ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా నిన్న ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అనకాపల్లి జిల్లా రాజాంలో 6.2, అల్లూరి జిల్లా కిలగదలో 5.9, విజయనగరం జిల్లా బొద్దాంలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అధికారులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.