తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నేటి నుంచి వర్షాలు పడతాయని అంచనా. ముఖ్యంగా హైదరాబాద్లో సాయంత్రం, రాత్రి వేళల్లో జల్లులు పడే అవకాశం ఉంది.
శుక్రవారం నాటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. నాగర్కర్నూల్లో 28.6°C, హైదరాబాద్ బండ్లగూడలో 30.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.