తెలంగాణ రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతోంది. రాజధాని హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
ఆదివారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్ సహా పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు, వృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.1 డిగ్రీలగా నమోదైంది. అయితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత తగ్గినట్లు అధికారులు తెలిపారు.
రానున్న మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 8.6 నుంచి 13.5 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.