హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ
నవంబర్ నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని లక్ష్యం
మొత్తం రూ.10,391 కోట్లతో భారీ ప్రాజెక్టు
వచ్చే ఏడాది మార్చి కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి
ఏపీలో కొత్తగా 162 హెక్టార్ల భూసేకరణకు ఏర్పాట్లు
231 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్–65) ఆరు వరుసల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను నవంబర్ మొదటి లేదా రెండో వారంలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి, వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇందులో నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ వంటి అవసరాలకు రూ.3,616.06 కోట్లు కేటాయించారు. దీని ప్రకారం కిలోమీటరుకు సగటున రూ.44.92 కోట్లు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టులో భాగంగా రహదారి వెంట పలు కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు. 33 మేజర్ జంక్షన్లు, 105 మైనర్ జంక్షన్లు, 4 కొత్త ఫ్లైఓవర్లు, 17 వెహికల్ అండర్పాస్లు/ఓవర్పాస్లు నిర్మించనున్నారు. అలాగే 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ విధానంలో రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 94 చోట్ల విశ్రాంతి ప్రాంతాలు, 16 బస్ షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు ఇటీవలే ఎన్హెచ్ఏఐ, రోడ్లు–భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. డీపీఆర్ను ఖరారు చేసేందుకు రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను అక్టోబర్ చివరి నాటికి అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక తుది డీపీఆర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు.