ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద అలర్ట్ – పులిచింతల నుంచి 65,000 క్యూసెక్కుల నీటి విడుదల
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 65,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
బ్యారేజ్కు వచ్చేవాటి నీటి ప్రవాహాన్ని అనుసరించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు అందజేశారు. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో వరద ప్రవాహం మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు మరియు సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలోనైనా సమాచారమొస్తే వెంటనే అక్కడికి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ సమయంలో నదిలో ఈత, చేపలు పట్టడం, పడవలో ప్రయాణించడం వంటివి నివారించాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.