నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ఇది నేడు మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి నమోదైన వర్షపాతం ఇలా ఉంది:
- తిరుపతి జిల్లా తొట్టంబేడులో 47.2 మి.మీ
- నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 37.5 మి.మీ
- తిరుపతి జిల్లా మన్నారుపోలూరులో 32.7 మి.మీ
- చిత్తూరు జిల్లా నిండ్రలో 30 మి.మీ
అధికారులు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.