ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ పాఠశాలలు నేడు బంద్ ప్రకటించాయి. కొంతమంది క్షేత్రస్థాయి విద్యా శాఖ అధికారుల ఒత్తిడి, ఏకపక్ష చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల యాజమాన్యాల సంఘాలు వెల్లడించాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, తమ సమస్యలను తెలియజేయడమే లక్ష్యమని స్పష్టం చేశాయి.
కొంతమంది అధికారులు యాజమాన్యాలను అవమానకరంగా ట్రీట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తరచూ హెచ్చరికలు, షోకాజ్ నోటీసులు ఇస్తూ పాఠశాలలను వేధిస్తున్నారని తెలిపారు. తాము తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా ఆర్టీఈ (విద్యా హక్కు చట్టం) ప్రవేశాల విషయంలో ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. సరైన డాక్యుమెంట్లు లేని విద్యార్థులను బలవంతంగా చేర్చుకోవాలని ఆదేశిస్తున్నారని వాపోయారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరింపులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు స్కూల్స్ మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.