పీ4 – జీరో పావర్టీపై సీఎం సమీక్ష, మార్గదర్శకులతో కీలక సమావేశం
పీ4 – జీరో పావర్టీ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్షిప్ (P4) మోడల్ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం త్వరలో మార్గదర్శకులతో సమావేశం కానున్నారు.
ఇప్పటి వరకు 18,332 మంది పీ4 మార్గదర్శకులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ఉన్నత వర్గాల వ్యక్తులు ఉన్నారు. వీరి సహకారంతో 1,84,134 బంగారు కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. మార్గదర్శులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు.
ఈ సందర్భంగా జూలై 18న అమరావతిలో 200 మంది టాప్ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎన్సీ ప్రతినిధులు, నిర్మాణ సంస్థల అధినేతలు, సెలబ్రిటీలను విందుకు ఆహ్వానించాలన్న అంశంపై సమీక్షలో చర్చ జరిగింది. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. సమాజంలో పేదలకు మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.