అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు విశాఖకు ప్రధాని మోదీ – పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ రోజు విశాఖపట్నంకి రానున్నారు. ఆయన ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, రేపు ఉదయం ఆర్కే బీచ్ వద్ద జరిగే యోగా వేడుకల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రధాని మోదీ ఈ సాయంత్రం సాయంత్రం 6:40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్కి వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి ఆయన తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు.
రేపు ఉదయం ప్రధాని ఉదయం 6:25 గంటలకు ఆర్కే బీచ్కు చేరుకుని 6:30 నుంచి 7:50 గంటల వరకు యోగా విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ యోగా ప్రదర్శనలో పాల్గొంటారని అంచనా. అనంతరం ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తారు.
యోగా కార్యక్రమం ముగిసిన తర్వాత, ప్రధాని తిరిగి ఆఫీసర్స్ మెస్కి 7:50 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 8:15 నుంచి 11:15 వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11:25కి, INS పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్లో విమానాశ్రయానికి వెళ్లి, 11:50 గంటలకు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. అలాగే, ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన విశాఖ వాసి చంద్రమౌళి భార్యను ప్రధాని కలిసే అవకాశం ఉందని సమాచారం.