ఐదేళ్ల విరామం తర్వాత రీన్యూ పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అడుగుపెడుతోంది. మొత్తం రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న దిశగా ఇది తొలి భారీ విజయం గా పరిగణిస్తున్నారు.
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి అయిన రీన్యూ సంస్థ, సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి ఆధునిక సాంకేతిక విభాగాల్లో పెట్టుబడులు పెట్టనుంది.
లోకేశ్ మాట్లాడుతూ, “ఐదేళ్ల విరామం తర్వాత రీన్యూ సంస్థ తిరిగి ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గర్వకారణం. సోలార్ ఇంగాట్ నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ రూ. 82,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది,” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం విశాఖకు వచ్చిన రీన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా బృందానికి లోకేశ్ సాదర స్వాగతం పలికారు. నిపుణులు ఈ పెట్టుబడి ద్వారా ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభించనున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చేలా ఉందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.