భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగం విపరీతంగా పెరుగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల విలువ సగటున ₹90,446 కోట్లకు చేరింది.
ఈ నివేదిక ప్రకారం, యూపీఐ లావాదేవీలు విలువ మరియు సంఖ్య పరంగా రెండు విధాలా గణనీయమైన వృద్ధిని సాధించాయి. జనవరిలో రోజువారీ సగటు విలువ ₹75,743 కోట్లుగా ఉండగా, జూలై నాటికి అది ₹80,919 కోట్లకు పెరిగింది. ఆగస్టులో ఈ సంఖ్య మరింత పెరిగి ₹90,000 కోట్ల మార్క్ను దాటింది.
లావాదేవీల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. జనవరితో పోలిస్తే ఆగస్టు నాటికి రోజువారీ ట్రాన్సాక్షన్లు 127 మిలియన్లు పెరిగి మొత్తం 675 మిలియన్లకు చేరుకున్నాయి.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీఐలో అగ్రగామి బ్యాంకులలో తాము ముందంజలో ఉన్నామని వెల్లడించింది. మొత్తం 5.2 బిలియన్ల లావాదేవీలు నిర్వహించి టాప్ రెమిటర్గా ఎస్బీఐ నిలిచింది. ఈ గణాంకాలు స్పష్టంగా యూపీఐ భారతదేశంలో చిన్న మొత్తాల బదిలీల నుంచి పెద్ద మొత్తాల వరకు ప్రతీ ఆర్థిక అవసరానికి ప్రధాన వేదికగా మారిందని సూచిస్తున్నాయి.