ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకురావడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులు, శాస్త్రవేత్తలతో సమగ్ర చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో మత్స్యకారుల వేట సామర్థ్యాన్ని పెంపొందించడం, అదనపు ఆదాయ వనరులు సృష్టించడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు.
క్యాంపు కార్యాలయంలో 100 రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మత్స్య శాఖ ఉన్నతాధికారులు, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CMFRI) విశాఖ శాస్త్రవేత్తలతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, అలాగే రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చ జరిగింది.
ప్రధానంగా, ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడం, చేపల వేటలో నైపుణ్యాలను పెంపొందించడం, మరియు మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం ముఖ్యాంశంగా ఉన్నాయని సమావేశంలో వివరించారు. CMFRI ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సూచనలను పరిశీలించి, వాటిని అమలు చేసే మార్గాలను కాకినాడ జిల్లా కలెక్టర్కు సూచించారు.
ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పిడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.