కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న కీలక బ్యారేజీల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి ఈవోఐ (Expression of Interest) కోరుతూ నేషనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఈవోఐ పిలవాలని ఆదేశించగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిజైన్ కన్సల్టెంట్ ఎంపికను రెండు వారాల్లో పూర్తి చేయమని ఆదేశించినప్పటి నుండి ప్రక్రియ వేగవంతమైంది.
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA) సిఫార్సుల మేరకు పునరుద్ధరణ పనులు చేపట్టబడ్డాయి. వర్షాకాలానికి ముందు, తరువాత బ్యారేజీల వద్ద భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వర్షాకాలం తర్వాత, ముఖ్యంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద వరదల కారణంగా పరీక్షలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తోంది. టెక్నికల్ మరియు ఫైనాన్షియల్ బిడ్ల ప్రక్రియ పూర్తయ్యేలోగా మిగిలిన పరీక్షలను పూర్తి చేయడం, అర్హత సాధించిన సంస్థలను పరీక్షలలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా ఉంది.