జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి కానుక: పవన్ కళ్యాణ్
అమరావతి, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన జీఎస్టీ సంస్కరణలను స్వాగతించారు. ఇవి దేశానికి నిజమైన దీపావళి కానుక అని పేర్కొన్నారు.
‘ఎక్స్’ లో చేసిన పోస్ట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ –
“ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ఇచ్చిన హామీని నెరవేర్చారు. పేదలు, మధ్యతరగతి, రైతులు, ఆరోగ్యరంగానికి ఊరట కలిగించేలా, విద్య, ఇన్సూరెన్స్ పై జీఎస్టీ పూర్తిగా తొలగించడం చారిత్రాత్మక నిర్ణయం. ఈ సంస్కరణలు కోట్లాది కుటుంబాల భారం తగ్గిస్తాయి” అని అన్నారు.
అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు జీఎస్టీ కౌన్సిల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచిన తర్వాత, ఈ జీఎస్టీ సంస్కరణలు దేశానికి నిజమైన దీపావళి కానుకగా మారాయని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు నాయుడు కూడా జీఎస్టీ మార్పులను స్వాగతిస్తూ – “పేదలకు మేలు చేసే, అభివృద్ధి దిశగా నడిపే నిర్ణయం ఇది. నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది” అన్నారు.
బీజేపీ ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని ప్రకటించిన నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రీఫార్మ్స్ వైపు ఇదే ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. పన్ను తగ్గింపులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, ఎంఎస్ఎంఈలు, రైతులు, వ్యాపారాలకు ఊరట కలిగిస్తాయని పేర్కొన్నారు.
నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి రానున్నాయి.