గూగుల్ పదేళ్ల తర్వాత తన ‘G’ లోగోను మార్చింది
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత తన ‘G’ లోగోలో మార్పులు తీసుకొచ్చింది. పాత లోగోలో ఉన్నట్లు ఇకపై నాలుగు సాలిడ్ రంగులు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం బాక్సులుగా ఉండవు. బదులుగా ఎరుపు పసుపు రంగులోకి, పసుపు ఆకుపచ్చ రంగులోకి, ఆకుపచ్చ నీలం రంగులోకి మారుతున్నట్లు కనిపిస్తుంది.
గూగుల్లో మరికొన్ని ఏఐ (AI) ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నందున కంపెనీ కొత్త గ్రేడియంట్ డిజైన్ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. 9to5Google నివేదిక ప్రకారం ఈ అప్డేట్ ప్రస్తుతం iOS, పిక్సెల్ పరికరాల్లో కనిపిస్తోంది. అలాగే గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 కలిగిన ఆండ్రాయిడ్ పరికరాల్లో కూడా కనిపిస్తోంది.
అయితే, గూగుల్ ప్రధాన వర్డ్మార్క్లో కంపెనీ ఇంకా ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, గూగుల్ తన ఉత్పత్తులలో ఏఐకు ప్రాధాన్యత ఇస్తున్నందున, భవిష్యత్తులో గ్రేడియంట్ డిజైన్ను ఇతర సేవలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. 2015 తర్వాత గూగుల్ తన ‘G’ లోగోను మొదటిసారిగా మార్పులు తీసుకొచ్చింది.