డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు
జనవరి 2-8 తేదీల కోటాకు సంబంధించి రూ.300 టికెట్లు రేపు విడుదల
రేపు ఆన్లైన్లో అందుబాటులోకి శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
తొలి మూడు రోజులు సామాన్య భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయింపు
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుండి వచ్చే ఏడాది జనవరి 8 వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా జనవరి 2 నుంచి 8 వరకు జరిగే ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్ల ఆన్లైన్ కోటాను రేపు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటాను అదే రోజు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక భక్తులు తమ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.
ఈసారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ సర్వదర్శనం టోకెన్లను ఇప్పటికే ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో కేటాయించినట్లు వెల్లడించింది.
కపిలేశ్వరాలయంలో కృత్తిక దీపోత్సవం
తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో బుధవారం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని కృత్తిక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ గోపురాలు, ధ్వజస్తంభంపై దీపాలంకరణ అనంతరం జ్వాలా తోరణం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.