హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమలో పని పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులతో సమావేశమయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టాలీవుడ్లో పని వాతావరణం మెరుగుపడాలి అని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సినీ కార్మికుల సమ్మెలో తాను జోక్యం చేసుకోవడం ద్వారా పరిశ్రమ వాతావరణం దెబ్బతినకుండా కాపాడినట్లు చెప్పారు.
సినీ రంగంలోని నైపుణ్యాల అభివృద్ధి కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పటికే తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, కానీ ఇప్పుడు తయారీ విధానాలు, కార్మిక సంక్షేమంలో సంస్కరణలు అవసరమని ఆయన అన్నారు.
నిర్మాతలు కార్మికుల పట్ల మానవీయ దృక్పథం చూపాలని కోరిన సీఎం, నిర్మాతలు – కార్మికులు – ప్రభుత్వం కలిసి కొత్త సినీ పాలసీ రూపొందిస్తామని తెలిపారు. “సినీ పరిశ్రమ అవసరాలను పరిగణలోకి తీసుకుని కొత్త అధ్యాయం రాయాలి” అని సీఎం అన్నారు. కొద్ది మంది పరిశ్రమను ఆధీనంలో ఉంచడాన్ని ప్రభుత్వం సహించదని ఆయన హెచ్చరించారు.
అలాగే, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సినిమా కేంద్రంగా మారిందని, ఇకపై తెలంగాణలోనే ఎక్కువ తెలుగు సినిమాలు నిర్మించాలంటూ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, దిల్ రాజు, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదితర ప్రముఖులు హాజరయ్యారు.