మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఎంపికల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. పాఠశాల విద్యాశాఖ నేడు తుది ఎంపిక జాబితాను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16,000 అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించబడుతుంది. అలాగే, అధికారిక వెబ్సైట్ cse.apcfss.in లో కూడా అందుబాటులో ఉంటుంది అని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ, సుమారు 16,000 పోస్టులు మాత్రమే భర్తీ చేయగలిగారు. కొన్ని మేనేజ్మెంట్లు మరియు సామాజిక వర్గాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లేని కారణంగా 300కు పైగా పోస్టులు మిగిలిపోయాయి. మిగిలిన పోస్టుల భర్తీ కోసం తదుపరి డీఎస్సీ క్రమంలో ప్రవర్తన కొనసాగించనున్నారు.
ఎంపికైన అభ్యర్థుల కోసం ఈ నెల 19న అమరావతి సచివాలయం సమీపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి 30,000 మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున వీరు విధుల్లో చేరుతారు.
డీఎస్సీ-2025 ప్రక్రియ ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదలతో ప్రారంభమై, జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్లైన్ పరీక్షలు సఫలంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ వివరించారు.