ఈ సంవత్సరం దేశంలో సాధారణం కంటే ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మొదటలో చక్కగా వర్షాలు కురిపించి ఆశ చూపించాయి. కానీ తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయి ప్రజలను తీవ్ర వేడితో ఇబ్బంది పెట్టాయి. వర్షాకాలంలోనూ వేసవి ఉక్కపోత కొనసాగడంతో ప్రజలు చలించిపోయారు.
ఇలాంటి సమయంలో భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. రాబోయే రెండు రోజులలో నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించనున్నాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం సముద్రం కలకలలాడుతోందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నాడు ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది.