మైక్రోసాఫ్ట్లో మూడో విడత ఉద్యోగాల కోత – సేల్స్ టీం ప్రధాన లక్ష్యం!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల లేఆఫ్స్ను ప్రకటించిన సంస్థ, ఇప్పుడు మూడో విడత కోసం ప్రణాళికలు రూపొందిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జులై ప్రారంభంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈసారి కోతలు ముఖ్యంగా సేల్స్ విభాగంపై ప్రభావం చూపే అవకాశముంది. సంస్థ పునర్నిర్మాణం, అలాగే కృత్రిమ మేధ (AI) రంగంలో పెట్టుబడుల పెంపు కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. జులైలో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని, మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక మార్పులకు అడుగులు వేస్తోంది.
ఇప్పటికే మే నెలలో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మందిని తొలగించింది. దానికి కొన్ని వారాల వ్యవధిలోనే మరో 300 మందికి పైగా ఉద్యోగులపై వేటు పడింది. గత లేఆఫ్స్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ప్రభావితమయ్యారు. ఇప్పుడు వచ్చే దఫాలో సేల్స్ టీం ప్రధానంగా ప్రభావితమయ్యే అవకాశముంది. 2023 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో 2,28,000 మంది ఉద్యోగులు ఉండగా, అందులో సుమారు 45,000 మంది సేల్స్, మార్కెటింగ్ విభాగానికి చెందినవారు. గతంలో కూడా 2023 జనవరిలో 10,000 మందిని తొలగించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.