అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయం – సీజ్ చేయాలన్న కమిషనర్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మించిన లేదా అంగీకరించిన ప్లాన్కి వ్యతిరేకంగా నిర్మించిన భవనాలను సీజ్ చేయాలని సర్క్యులర్ జారీ చేశారు. అందులో నివసిస్తున్నవారు ఉంటే వారిని మూడు రోజుల్లో భవనం ఖాళీ చేయాలనే సూచన ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఆ భవనాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, మెట్లు, లిఫ్టులు, ర్యాంపులను ఎర్రటి రిబ్బన్తో మూసివేయాలని ఆదేశించారు.
జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఇప్పటినుంచి కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 461-A మరియు TG-bPASS నిబంధనల ప్రకారం అధికారిక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో, అధికారులు అక్రమ నిర్మాణాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని కోర్టు తీవ్రంగా ఆగ్రహించింది. భవనాలు పూర్తయ్యేంతవరకు అధికారులు ఏం చేస్తున్నారు? కళ్లు మూసుకుని కూర్చుంటున్నారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇకపై చట్టాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.