రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజల రాకపోకలు, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి.
హనుమకొండ బస్టాండ్, హనుమకొండ చౌరస్తా, కాజీపేట, హసన్పర్తి, గోకుల్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాత బీటు బజార్, హంటర్ రోడ్, శివనగర్, కరీమాబాద్లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. సంగెం మండలంలో 20 సెం.మీ., ఖిల్లా వరంగల్లో 14.8 సెం.మీ., వర్ధన్నపేటలో 12 సెం.మీ. వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లాలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దంతాలపల్లి మండలంలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ పలు గ్రామాలకు రాకపోకలు నిలిపివేసింది.