ఇకపై ప్రవాసాంధ్ర భక్తులకు తిరుమలలో ప్రతిరోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ కోటాను 50 టికెట్ల నుంచి కేవలం 10కి తగ్గించడంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు భక్తులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
ఈ అంశాన్ని ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీ (APNRT) అధ్యక్షుడు రవివేమూరి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఫిబ్రవరిలో తీసుకెళ్లారు. సమస్యను సీరియస్గా తీసుకున్న సీఎం వెంటనే స్పందించి ప్రవాసాంధ్రుల కోసం కోటాను 10 నుండి 100 టికెట్లకు పెంచారు. ఈ మేరకు టిటిడి అధికారులకు ప్రత్యేక సూచనలు చేశారు.
ఈ టికెట్లు పొందాలంటే, ప్రవాసాంధ్రులు ముందుగా https://apnrts.ap.gov.in వెబ్సైట్లో ఉచితంగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి. నివసిస్తున్న దేశానికి సంబంధించిన వీసా, వర్క్ పర్మిట్ వివరాలు అప్లోడ్ చేయాలి. వెబ్సైట్లో మూడు నెలల ముందుగా దర్శన స్లాట్లు కనిపిస్తాయి. అందులో ఒకదాన్ని బుక్ చేసుకోవాలి. టిటిడి అధికారులు దినసరి పరిస్థితుల ఆధారంగా టికెట్లను కేటాయిస్తారు. టికెట్లు వచ్చిన వారికి ఏపీఎన్ఆర్టీఎస్కి చెందిన పీఆర్ఓ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు ప్రవాసాంధ్రులు తాడేపల్లి ఏపీఎన్ఆర్టీ కార్యాలయం ఫోన్ నంబర్ 0863 2340678 ను సంప్రదించవచ్చు అని సంస్థ ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు.