ఆశిష్ అగర్వాల్ బెయిల్ మరోసారి తిరస్కరణ
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ అగర్వాల్ (ఏ15) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నెల్లూరు ACB కోర్టు మరోసారి తిరస్కరించింది. ఈ స్కాం పూర్తిగా 'దృశ్యం' సినిమా మాదిరిగా ఉందని SIT కోర్టుకు వివరించింది.
ఖాళీ లారీలు, నకిలీ బిల్లులు – ₹146 కోట్ల స్కాం
ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టులో వాదిస్తూ, ఆశిష్ అగర్వాల్ భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్కు అత్యంత సమీపంగా ఉన్నాడని తెలిపారు. అసలు నెయ్యి సరఫరా చేయకుండా ఖాళీ లారీలను తిప్పి సరఫరా అయినట్లు ఫేక్ రికార్డులు సృష్టించినట్లు తెలిపారు. అగర్వాల్ ట్రేడింగ్, సుప్రీం ఇంక్, అగర్వాల్ అండ్ సన్స్ వంటి ఫేక్ కంపెనీల పేరుతో రూ.146 కోట్ల నకిలీ ఇన్వాయిస్లు తయారు చేశారని వెల్లడించారు. ఇవే పత్రాలను అధికారుల తనిఖీల్లో చూపించి తప్పించుకున్నారని తెలిపారు.
హవాలా ద్వారా డబ్బు వెనక్కి – సెల్ఫోన్ ధ్వంసం
భోలేబాబా డెయిరీ నుండి ఫేక్ కంపెనీలకు ఆన్లైన్ ద్వారా పంపిన డబ్బును హవాలా మార్గంలో తిరిగి సూత్రధారులకు చేరచేసినట్లు SIT తెలిపింది. ఇందుకు ఆశిష్కు 2-3 శాతం కమీషన్ లభించిందని పేర్కొన్నారు. తిరుమలతో పాటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా అయినా ఆశిష్ సహకరించినట్లు వెల్లడించారు. సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు తన మొబైల్ను నాశనం చేశాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కోర్టును ఆ SIT న్యాయవాది హెచ్చరించారు. కోర్టు కూడా అంగీకరించి బెయిల్ను తిరస్కరించింది.