సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకల్లో విషాద ఘటన
విశాఖ జిల్లా సింహాచలం లోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద సిమెంటు గోడ గాలివాన కారణంగా కూలిపోయి 8 మంది భక్తులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం అర్ధరాత్రి భారీగా భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చారు. ఇదే సమయంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టికెట్ క్యూలైన్ పై గోడ కూలిపోవడంతో విషాదం నెలకొంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.
సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే స్పందించింది. హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను కేజీహెచ్ కు తరలించి గాయపడినవారికి చికిత్స అందిస్తున్నారు.