బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ఆయన 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను గృహ వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా గురువారం పోస్ట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో జరగనున్న నేపథ్యంలో ఈ పథకం వెలువడింది.
నితీశ్ కుమార్ మాట్లాడుతూ – “మేము ఎప్పటి నుంచో తక్కువ ధరకే విద్యుత్ అందిస్తున్నాం. 2025 ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభించనుంది. జూలై నెల బిల్లుల నుంచే ఇది అమల్లోకి వస్తుంది” అని తెలిపారు. ఈ పథకం సుమారు 1.67 కోట్ల కుటుంబాలకు లాభం చేకూర్చనుంది. అలాగే ఇంటి పైకప్పులపై లేదా సమీపంలోని ప్రదేశాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు, ఇది తొలి మూడు సంవత్సరాల్లో అమలవుతుంది.
అత్యంత పేద కుటుంబాలకు కుటిర్ జ్యోతి పథకం కింద ప్రభుత్వం పూర్తిగా ఖర్చు భరిస్తుందని, మిగతా వారికి సహాయాన్ని అందిస్తామని సీఎం తెలిపారు. అంతేకాక, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం TRE-4 పరీక్షను త్వరగా నిర్వహించాలంటూ విద్యాశాఖను ఆదేశించారు. మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు.