బుధవారం ఆలయ బ్యాంక్ ఖాతాలో జమ అయిన విరాళం మొత్తం
హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళం అందజేశారు. ఈ విరాళం బుధవారం ఆలయ బ్యాంక్ ఖాతాలో జమైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కృష్ణ ఆలయ ప్రాముఖ్యత, విశేషాలను వివరించి, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్థించారు.
ఆ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి, నీతా అంబానీ రూ. కోటి విరాళాన్ని అందించారు. ఈ విరాళం మొత్తం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అందులో నుంచి వచ్చే వడ్డీతో ఆలయంలో ప్రతిరోజూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రస్తుత ఇన్ఛార్జి ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు.
ఈ నిధులు భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేయడంలో ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.