800 ఎలక్ట్రిక్ వాహనాలు సహా మొత్తం 3,000 కార్లు రవాణా చేస్తున్న మార్నింగ్ మిడాస్ అనే భారీ కార్గో నౌక మూడు వారాల క్రితం జరిగిన అగ్నిప్రమాదం అనంతరం ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ నౌక చైనాలోని యెంటాయ్ నుంచి మెక్సికోలోని లాజారో కార్డెనాస్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అలస్కా తీరానికి 415 మైళ్ల దూరంలో, 16,400 అడుగుల లోతు ఉన్న ప్రాంతంలో నౌక మునిగిపోయినట్టు యూఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. జూలై 3న, అలస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో నౌకలో మంటలు చెలరేగాయి. ప్రమాద సంకేతాలు అందిన వెంటనే యూఎస్ కోస్ట్ గార్డ్ స్పందించింది. 22 మంది సిబ్బంది లైఫ్బోట్ల ద్వారా బయటపడి, సమీపంలోని వాణిజ్య నౌక సిబ్బంది వారిని రక్షించారు.
ఈ నౌకను లండన్కు చెందిన జోడియాక్ మారిటైమ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. లైబీరియా జెండాతో రిజిస్టర్ చేయబడి, 2006లో నిర్మించబడిన ఈ నౌక ప్రస్తుతం మునిగిపోయింది. ప్రస్తుతం కాలుష్య ఆనవాళ్లు లేవు అని కోస్ట్ గార్డ్ పేర్కొంది. అయితే, అగ్నిప్రమాదం, వాతావరణ ప్రభావం, మరియు నౌకలోకి నీరు చేరడం వల్లే మునక జరిగిందని వారు తెలిపారు.