పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
- సాధారణ తేదీ కంటే మూడు రోజుల ముందుగానే ఉపసంహరణ
- ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7% అధిక వర్షపాతం
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
ఈ సంవత్సరం దేశానికి సమృద్ధిగా వర్షాలను అందించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రారంభించాయి. ఆదివారం (సెప్టెంబర్ 14) పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా ఈ ప్రక్రియ సెప్టెంబర్ 17న ప్రారంభమవుతుంటే, ఈసారి మూడు రోజుల ముందుగానే మొదలవడం ప్రత్యేకత.
జూన్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు దేశంలో మొత్తం 846.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం (790.1 మిల్లీమీటర్లు) కంటే 7% ఎక్కువ.
ఇక రుతుపవనాలు వెనుదిరుగుతుండగా, మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 20వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, అది మరింత బలపడుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత కావాలి.