సమోసా, జిలేబీ లాంటి వంటకాలపై డిజిటల్ బోర్డులూ?.. కేంద్రం స్పష్టత ఇచ్చింది
సమోసా, జిలేబీ, వడాపావ్ వంటి భారతీయ వంటకాలలో ఉండే పంచదార, నూనె శాతం చూపే డిజిటల్ బోర్డులు పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాలలో ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చిందన్న వార్తలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ వంటకాల్లో కూడా సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లు హెచ్చరికలు ఉండాలన్నట్టుగా వార్తలు ప్రచారం అయ్యాయి.
కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. ఇటువంటి ఆదేశాలు జారీ చేయలేదని, వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపింది. PIB ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వార్తలు తప్పు అని స్పష్టం చేసింది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహాలు మాత్రమే ఇచ్చినట్టు కేంద్రం పేర్కొంది. వీధి ఆహార సంస్కృతిని లక్ష్యంగా చేసుకోలేదని, ప్రత్యేకంగా ఏ వంటకాల పేరు ప్రస్తావించలేదని కూడా కేంద్రం వెల్లడించింది. మెరుగైన ఆహార నియమాలు, జీవనశైలి ప్రోత్సహించాలన్నదే కేంద్ర ఉద్దేశమని పేర్కొంది.