భారత సైన్యానికి స్టెర్లింగ్ స్థానంలో ఆధునిక సీక్యూబీ తుపాకులు
భారత సైన్యం ప్రస్తుతం వాడుతున్న పాత స్టెర్లింగ్ కార్బైన్లను తొలగించి, అత్యాధునిక క్లోస్ క్వార్టర్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్లను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), భారత్ ఫోర్జ్ లిమిటెడ్లతో సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.2,000 కోట్లు కాగా, డీఆర్డీఓ మరియు భారత్ ఫోర్జ్ లిమిటెడ్లు ఎల్-1 బిడ్డర్లుగా ఎంపికయ్యారు.
ఈ కొత్త తుపాకులు 5.56×45 మిల్లీమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి తేలికగా, చిన్నగా ఉండటంతో సైనికులు ఎన్కౌంటర్ల సమయంలో వేగంగా స్పందించగలుగుతారు. ఈ గన్లను పూణేలోని డీఆర్డీఓ-ఏఆర్డీఈ అభివృద్ధి చేయగా, వాటి ఉత్పత్తిని భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ నిర్వహించనుంది.
ఈ ఆధునిక గన్లలో ఆప్టిక్స్, లేజర్ డిజిగ్నేటర్స్ వంటి టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. వీటివల్ల సైనికులు సమీప యుద్ధాల్లో మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతారు. ఈ ఒప్పందం కింద సుమారు 4 లక్షల సీక్యూబీ తుపాకులు తయారీ చేసి సైన్యానికి అందించనున్నారు.