అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ చార్జీల పెంపు అమల్లోకి రానుంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత తపాలా శాఖ నిర్వహణ ఖర్చులు పెరగడంతో స్పీడ్ పోస్ట్ రేట్లను సవరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్త సదుపాయాలను కూడా ప్రారంభించింది. ఇకపై ఈ-కామర్స్ తరహాలో ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని అమలు చేయనుంది. అంటే పార్సిల్ డెలివరీ సమయంలో పోస్ట్మ్యాన్కి వినియోగదారు ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక సేవ కోసం అదనంగా రూ.5 చెల్లించాలి. అంతేకాకుండా డెలివరీ సమయంలో ఆన్లైన్ పేమెంట్లు చేయడం, ఎస్సెమ్మెస్ అలర్ట్లు పొందడం, రియల్ టైమ్ డెలివరీ అప్డేట్లు తెలుసుకోవడం వంటి ఆధునిక ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అలాగే 'రిజిస్ట్రేషన్' పేరుతో కొత్త సేవను ప్రవేశపెట్టారు. దీని ద్వారా పార్సిల్ను వినియోగదారు సూచించిన వ్యక్తికి, నిర్దేశిత చిరునామాలోనే కచ్చితంగా అందేలా చూసుకుంటారు. దీనికి కూడా రూ.5 అదనంగా చెల్లించాలి. విద్యార్థులకు మాత్రం స్పీడ్ పోస్ట్ చార్జీలపై 10 శాతం ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు పోస్టల్ శాఖ ప్రకటించింది. ఈ మార్పులతో స్పీడ్ పోస్ట్ సేవలు మరింత సురక్షితంగా, ఆధునికంగా, వినియోగదారులకు అనుకూలంగా మారనున్నాయి.
స్పీడ్ పోస్ట్ చార్జీల పెంపు – ఇకపై ఓటీపీ చెప్పినప్పుడే డెలివరీ