జీహెచ్ఎంసీ ఆదాయంలో భారీ వృద్ధి – రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ జోరులో
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ గాడిన పడుతోందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆదాయంలో భారీ పెరుగుదల నమోదైంది.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి ఐదు నెలల్లోనే భవన అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల (OC) ద్వారా వచ్చిన ఆదాయం 90 శాతం పెరిగి రూ.750 కోట్లకు పైగా చేరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.309 కోట్లే.
జీహెచ్ఎంసీ ప్రకారం, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల్లోనే 4,389 కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు, అలాగే 1,008 నివాసయోగ్య పత్రాలు జారీ చేశారు.
గత సంవత్సరం మొత్తం రూ.1138 కోట్ల ఆదాయం వచ్చినా, ఈసారి ఐదు నెలల్లోనే ఆ మొత్తంలో 65 శాతం వసూలు కావడం గమనార్హం. ఇండిపెండెంట్ ఇళ్లతో పాటు ఐదు అంతస్తులలోపు భవనాల నిర్మాణాలు కూడా పెరుగుతున్నాయి.
'బిల్డ్ నౌ' విధానం ప్రభావం
ఈ వృద్ధికి మరో ప్రధాన కారణం మార్చి 20 నుంచి జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ‘బిల్డ్ నౌ’ విధానం. దీని ద్వారా భవన అనుమతుల ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు.
సింగిల్ విండో సిస్టమ్, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలతో రెవెన్యూ, ఇరిగేషన్ వంటి విభాగాల నుంచి ఎన్వోసీలు త్వరగా లభించడం వల్ల దరఖాస్తులు తక్షణమే పరిష్కారం అవుతున్నాయి.
ఈ సానుకూల మార్పుల కారణంగా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ ఆదాయం గణనీయంగా పెరిగి, నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత ఊపందుకుంది.