అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 4,000 డాలర్ల పైకి ఎగసి చరిత్రలో తొలిసారి ఈ స్థాయికి చేరింది. ఈ ప్రభావంతో భారత్లో తులం బంగారం ధర రూ.1.22 లక్షల మార్కును దాటింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల పసిడి ధర రూ.1,22,000 దాటి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,002.53 డాలర్ల వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. యూఎస్ కమొడిటీ ఎక్స్ఛేంజ్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్సుకు 4,025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ఇక దేశీయ మార్కెట్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర బుధవారం ఉదయం రూ.1,22,101కి చేరి 0.69 శాతం పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.73 శాతం పెరిగి కేజీ ధర రూ.1,46,855కి చేరింది.
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్, ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం, జపాన్, అర్జెంటీనాలలో ఆర్థిక సమస్యలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడం వంటివి పెట్టుబడిదారులను పసిడివైపు మళ్లిస్తున్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం, ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకి దోహదం చేస్తున్నాయి. ఈ ఏడాది బంగారం ధరలు ఇప్పటికే 55 శాతం పెరిగాయి. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే బంగారం ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.