డిసెంబరు నాటికి మరింత తగ్గనున్న బంగారం ధరలు!
బంగారం ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల సంకేతాలు వంటి అంశాలు పసిడి ధరల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
ఇటీవల 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.23 లక్షలకు దిగొచ్చింది. అక్టోబర్ నెలలో ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ట్రంప్–జిన్పింగ్ చర్చలు సానుకూలంగా సాగడం, దేశంలో పండుగల సీజన్ ముగియడం వంటి పరిణామాలు స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయి.
గ్లోబల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి 4,000 డాలర్ల స్థాయికి పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబరు నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. అక్టోబర్లో కిలో వెండి ధర రూ.2 లక్షలు దాటగా, ప్రస్తుతం రూ.1.66 లక్షలకు తగ్గింది. రాబోయే వారాల్లో వెండి ధరలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధరను 10 గ్రాములకు $42, వెండి దిగుమతి ధరను కిలోకు $107 చొప్పున తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.