దేశవ్యాప్తంగా ఈ-పాస్పోర్ట్లు
భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 (PSP 2.0) ద్వారా దేశవ్యాప్తంగా చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు కొన్ని నగరాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్గా అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇక ప్రతీ పౌరునికీ అందుబాటులో ఉంటాయి. విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ 13వ పాస్పోర్ట్ సేవా దినోత్సవం సందర్భంగా ఈ కీలక ప్రకటన చేశారు.
ఆధునిక టెక్నాలజీతో వేగవంతమైన సేవలు
మంత్రి మాట్లాడుతూ, “పౌర సేవలను మెరుగుపరచడం కోసం అత్యాధునిక టెక్నాలజీతో PSP 2.0 ప్రారంభించాం. ఇది 'సేవ, సుశాసన, గరీబ్ కల్యాణ్' లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. ఈ పద్ధతి డిజిటల్ ఇండియా అనుభవాన్ని పౌరులకు అందిస్తుంది. ఈ-పాస్పోర్ట్ల వల్ల ఇమ్మిగ్రేషన్ వేగంగా, మోసాలకు అడ్డుకట్ట పడుతుంది" అని తెలిపారు.
ఈ-పాస్పోర్ట్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
ఈ-పాస్పోర్ట్ అనేది సాధారణ పాస్పోర్ట్కు తోడు ఒక ఆర్ఎఫ్ఐడీ చిప్ కలిగి ఉంటుంది. ఈ చిప్లో పాస్పోర్ట్ దారుడి వివరాలు, ఫోటో, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారం ఉంటాయి. పాస్పోర్ట్ కవర్పై బంగారు రంగు చిహ్నం ఉండడం ద్వారా ఇది గుర్తించవచ్చు. ఎయిర్పోర్ట్లో చిప్ స్కానింగ్ ద్వారా వేగంగా ధృవీకరణ జరుగుతుంది.
దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది?
ఈ-పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసే విధానం సులభం:
-
passportindia.gov.in వెబ్సైట్ను సందర్శించండి
-
కొత్తవారు రిజిస్టర్ చేసుకోండి, ఉన్నవారు లాగిన్ అవ్వండి
-
అప్లికేషన్ ఫారమ్ నింపి, సమీప PSK లేదా POPSKలో అపాయింట్మెంట్ బుక్ చేయండి
-
ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి
-
అపాయింట్మెంట్ రోజున బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
ఈ-పాస్పోర్ట్ ప్రయోజనాలు
-
భద్రత ఎక్కువ: డేటా చిప్లో సురక్షితంగా ఉంటుంది
-
మోసాలకు అడ్డుకట్ట: ట్యాంపరింగ్/నకిలీ చేయడం కష్టమే
-
వేగవంతమైన ఇమ్మిగ్రేషన్: స్కాన్తో తక్షణ సేవ
-
అంతర్జాతీయ ప్రమాణాలు: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు