ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ డబ్బు ఉపసంహరణ నిబంధనలను మరింత సరళతరం చేస్తూ కీలక మార్పులు చేసింది. ఇకపై ఉద్యోగులు కేవలం 12 నెలల సర్వీసు పూర్తి చేసిన వెంటనే తమ పీఎఫ్ ఖాతాలోని 75 శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఉన్న 13 రకాల పాక్షిక ఉపసంహరణ నిబంధనలను రద్దు చేసి, వాటన్నింటినీ ఒకే విధానంలోకి తీసుకొచ్చారు. పాత విధానంలో ఉన్న సంక్లిష్టమైన అర్హతలు, సర్వీసు కాలపరిమితుల వల్ల అనేక దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవి. ఇప్పుడు అన్ని రకాల విత్డ్రాలకూ ఒకే అర్హత కాలం — 12 నెలలు మాత్రమే. తాజా నిబంధనల ప్రకారం ఉద్యోగి విత్డ్రా చేసుకునే మొత్తంలో యజమాని వాటా కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఉద్యోగి చేతికి అందే మొత్తం గతంతో పోలిస్తే మరింత పెరుగుతుంది. నిరుద్యోగం పరిస్థితుల్లో కూడా 75 శాతం బ్యాలెన్స్ను వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగుల దీర్ఘకాలిక భద్రతను దృష్టిలో ఉంచుకుని, పదవీ విరమణ సమయానికి కనీసం 25 శాతం మొత్తం ఖాతాలో ఉంచాల్సిన నిబంధనను కొనసాగించారు. అలాగే పెన్షన్ నిధుల విషయంలో కూడా మార్పులు చేస్తూ, విత్డ్రా గడువును 2 నెలల నుంచి 36 నెలలకు పెంచారు. ఈ మార్పుల వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు పెన్షన్ అర్హత పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.
National
EPFO: పీఎఫ్ డబ్బు విత్డ్రా ఇప్పుడు సులభం – కొత్త నిబంధనలు ఇవే!