వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. భక్తుల ఆగ్రహం మధ్య ఎల్ఈడీ దర్శనం మాత్రమే
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు నిరాశ ఎదురైంది. కార్తిక మాసం కావడంతో స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఈ తెల్లవారుజామున ప్రధాన ద్వారాన్ని ఇనుప రేకులతో పూర్తిగా మూసివేశారు.
ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో గత నెల రోజులుగా గుడి పరిసరాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దక్షిణ, ఉత్తర ప్రాకారాలు, నైవేద్యశాల, ఈవో కార్యాలయాన్ని తొలగించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు. ప్రస్తుతం కేవలం అర్చకులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి స్వామివారికి చతుష్కాల పూజలు నిర్వహిస్తున్నారు.
అయితే, పవిత్రమైన కార్తిక మాసంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన వారు స్వామివారిని దర్శించుకోలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. చాలామంది భక్తులు ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై కనిపిస్తున్న రాజన్నను చూసి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు.
ప్రస్తుతం రాజన్న ఆలయానికి బదులుగా సమీపంలోని భీమేశ్వరాలయంలోనే దర్శన ఏర్పాట్లు చేశారు. కోడె మొక్కులు, ఇతర ఆర్జిత సేవలను కూడా అక్కడే నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.