అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు మళ్లీ ప్రారంభం – సోషల్ మీడియా తనిఖీ తప్పనిసరి!
ఈ ఏడాది మే నెలాఖరు నుంచి తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు అమెరికా ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇది కీలకమైన సమాచారం. అయితే, ఈసారి వీసా ప్రక్రియలో కొత్త షరతును అమలు చేస్తున్నారు – దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ తప్పనిసరి అయింది.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, వీసా అప్లికేషన్ను పరిశీలించే అధికారులు విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్లను పూర్తిగా తనిఖీ చేస్తారు. ఈ తనిఖీ కోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలను 'పబ్లిక్' మోడ్లో ఉంచాలి అని సూచించారు. "దేశ భద్రత దృష్ట్యా ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించాలి. అందుకే సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి" అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ ప్రక్రియను ‘సోషల్ మీడియా వెట్టింగ్’ అంటారు. దీని ద్వారా అధికారులు విద్యార్థుల ఆన్లైన్ కార్యకలాపాలను పరిశీలించి, అమెరికాలోకి అనుమతించాల్సినవారేనా అన్నది నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఎవైనా తమ సోషల్ మీడియా ఖాతాలో పాలస్తీనా జెండా వంటి రాజకీయ భావాలున్న పోస్టులు షేర్ చేస్తే, వారి దరఖాస్తు మరింత లోతుగా పరిశీలిస్తారు. దేశ భద్రతకు ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే స్టూడెంట్ వీసా మంజూరు చేస్తారు. దీని ద్వారా అర్హులైన వారికి అవకాశం ఇవ్వడమే కాకుండా, దేశ భద్రతను కాపాడే విధానాన్ని అమలు చేస్తున్నట్లు అమెరికా చెబుతోంది.