అమెరికా డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ నుంచి భారత్ను మరోసారి మినహాయించింది. దీని వల్ల కనీసం 2028 వరకు భారతీయులు ఈ లాటరీకి అనర్హులు అవుతున్నారు. అమెరికాకు అధిక సంఖ్యలో భారతీయులు వలస వెళ్తుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. ఈసారి భారత్తో పాటు చైనా, పాకిస్థాన్, కెనడా వంటి దేశాలకు కూడా లాటరీలో అవకాశం ఇవ్వలేదు.
అమెరికా డీవీ లాటరీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం వలస జనాభాలో వైవిధ్యాన్ని పెంచడం. గత ఐదేళ్లలో 50,000 మందికంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చిన దేశాల పౌరులకే లాటరీ అర్హత ఉంటుంది. కానీ భారత్ నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని దాటిపోవడంతో ఆటోమేటిక్గా భారతీయులు ఈ లాటరీకి అనర్హులయ్యారు.
అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021లో 93,450 మంది, 2022లో 1,27,010 మంది, 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ఈ భారీ సంఖ్య కారణంగానే డీవీ లాటరీలో భారత్ స్థానాన్ని కోల్పోయింది.
ప్రస్తుతం హెచ్-1బీ వీసా, పెట్టుబడుల ఆధారిత వలస, కుటుంబ స్పాన్సర్షిప్ లేదా ఆశ్రయం వంటి పరిమిత మార్గాల ద్వారానే భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవచ్చు. అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన వలస విధానాలు అనుసరించడంతో ఈ మార్గాలు కూడా మరింత కఠినతరంగా మారుతున్నాయి. విద్యార్థి వీసాల పరిశీలన, సోషల్ మీడియా స్క్రీనింగ్, బ్యాక్గ్రౌండ్ చెక్ వంటి చర్యలతో వలస ప్రక్రియ మరింత కఠినంగా మారింది. దీని వల్ల అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే భారతీయులకు ఈ నిర్ణయం పెద్ద షాక్గా మారింది.