అవయవదానంలో తెలంగాణకు మళ్లీ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం అవయవదానంలో మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2024 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక అవయవదానాలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ, నోటో విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడి చేశారు. ఈ ఘనతకు ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న 'జీవన్దాన్' కార్యక్రమమే.
ఈ కార్యక్రమం ద్వారా మరణించిన వ్యక్తుల అవయవాలను తీసుకుని ఇతరులకు పునర్జీవం కలిగిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలు, కాలేయం, గుండె, కంటి కార్నియా వంటి అవయవాలు తీసుకోవడంలో తెలంగాణ దేశంలో ముందుంది. గత నాలుగేళ్లలో అవయవదాతల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. 2021లో 162 మంది ఉండగా, 2022లో 194కి చేరింది. అదే ధోరణి 2023, 2024లో కొనసాగింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవయవదానం రేటు ప్రతి పది లక్షల మందికి 0.8గా ఉండగా, తెలంగాణలో ఇది 4.88గా ఉంది. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రభుత్వ విధానాలు, ఆసుపత్రుల మధ్య సమన్వయం, ప్రజల అవగాహన వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని నిపుణులు చెబుతున్నారు. ఈ మోడల్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని సూచిస్తున్నారు.