ఈసారి ఫిబ్రవరి చివరిలోనే ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఉండేలా ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆమోదం కోసం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పంపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేలా రెండు వేర్వేరు టైం టేబుళ్లు ప్రభుత్వానికి సమర్పించబడ్డాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున, ఆయన ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది. గత కొన్నేళ్లుగా కరోనా కారణంగా మార్చి నెలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను ఈసారి మళ్లీ ఫిబ్రవరి చివరికి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. దీనివల్ల జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్ పరీక్షలకు విద్యార్థులు సులభంగా సన్నద్ధం కావచ్చని భావిస్తున్నారు.
ఇక పరీక్ష ఫీజుల పెంపుపై కూడా బోర్డు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రాక్టికల్స్ ఉన్న కోర్సులకు రూ.750 చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇవి వరుసగా రూ.600 మరియు రూ.875కు పెరగొచ్చు. ఈ ఏడాది సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.