భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించిన సంస్థ, ఉద్యోగుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉన్నట్లు వెల్లడించింది. కేవలం మూడు నెలల్లోనే దాదాపు 20 వేల మంది ఉద్యోగులు తగ్గడం ఐటీ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కంపెనీ అధికారిక గణాంకాల ప్రకారం, జూన్ ముగిసే సమయానికి 6,13,069 మంది ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 5,93,314కు పడిపోయింది. అంటే, కేవలం మూడు నెలల్లోనే 19,755 మంది ఉద్యోగులు తగ్గారు. ఇది ఇటీవల కాలంలో ఐటీ రంగంలో నమోదైన అత్యంత పెద్ద తగ్గుదలల్లో ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే, నికర లాభంలో కేవలం 1.39% స్వల్ప వృద్ధి మాత్రమే నమోదైంది. టీసీఎస్ ఈ త్రైమాసికంలో రూ. 12,075 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అలాగే, కార్యకలాపాల ఆదాయం 2.39% పెరిగి రూ. 65,799 కోట్లకు చేరింది.
ఉద్యోగుల తొలగింపుపై ఉద్యోగ సంఘం నైట్స్ (NITES) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగులను తొలగించారని ఆరోపించింది. అయితే, టీసీఎస్ సీహెచ్ఆర్ఓ సుదీప్ కున్నుమల్ ఈ ఆరోపణలను ఖండించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేవలం 6 వేల మంది ఉద్యోగులను మాత్రమే విడుదల చేశామని తెలిపారు. అయినప్పటికీ, కంపెనీ ప్రకటనలు మరియు వాస్తవ గణాంకాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం.