ఆర్ఆర్బీ మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీస్ పరీక్ష తేదీలు – సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు ఆన్లైన్ రాతపరీక్షలు
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ రాతపరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు 2025 సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరగనున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,036 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపిక విధానం ఆన్లైన్ రాతపరీక్ష, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్లేషన్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ త్వరలో విడుదల అవుతాయి. అడ్మిట్ కార్డులు పరీక్షకు నాలుగు రోజుల ముందుగా అందుబాటులోకి వస్తాయి.
తెలంగాణ బడులకు పదో తరగతి మార్కుల మెమోలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి (SSC) లాంగ్ మెమోలు పాఠశాలలకు పంపిణీ చేస్తోంది. ఈ మెమోలు మార్చి రెగ్యులర్ పరీక్షలు మరియు జూన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉత్తీర్ణులైన విద్యార్థుల ఫలితాలను కలిగి ఉంటాయి.
ప్రస్తుతం రాష్ట్రంలోని 11,000 పాఠశాలలకు మెమోలు పంపాల్సి ఉంది. అందులో 2,000 పాఠశాలలకు ఇప్పటికే పంపించారు. మిగిలిన పాఠశాలలకు త్వరలోనే పంపనున్నారు.