"The Future I Saw" అనే మాంగాలో జులై 5, 2025న జపాన్లో భారీ సునామీ వస్తుందన్న జోస్యం తీవ్ర కలకలం రేపుతోంది. రచయిత్రి రియో తత్సుకి రాసిన ఈ మాంగా 2021లో వెలువడింది. ఈ జోస్యం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో జపాన్ ప్రజలు, పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ పుకార్ల ప్రభావంతో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపొందుతోంది. టొట్టోరి ప్రాంతంలో హాంగ్కాంగ్ నుంచి వచ్చే బుకింగ్లు 50% తగ్గిపోయాయి. విమానయాన సర్వీసులు కూడా తగ్గిపోతున్నాయి. నోమురా రీసెర్చ్ అంచనా ప్రకారం, జపాన్ పర్యాటక రంగం దాదాపు 560 బిలియన్ యెన్లు (సుమారు $3.9 బిలియన్లు) నష్టం చవిచూడవచ్చని అంటోంది.
ఇదే సమయంలో జపాన్ ప్రభుత్వం, వాతావరణ నిపుణులు ఈ జోస్యాన్ని ఖండిస్తున్నారు. భూకంపాలు, సునామీలు ముందుగా అంచనా వేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. రచయిత్రి రియో తత్సుకి సైతం ఇది కేవలం కల్పిత కథ అని, ప్రజలు భయపడకూడదని విజ్ఞప్తి చేశారు. అయినా, సోషల్ మీడియాలో ఈ వదంతుల ప్రభావం కొనసాగుతూనే ఉంది.